నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులమనే విషయాన్ని మరవొద్దని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా వారికి కల్పించడిందని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ జి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే ఆర్టీఐ యాక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. సమాచార హక్కు చట్టం – 2005పై పీఐవోలకు, ఏపీఐవోలతోపాటు అన్ని శాఖల అధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాస్రావు, దేశాల భూపాల్ హాజరయ్యారు.
సమాచార హక్కు చట్టంలోని 2 షెడ్యూళ్లు, 6 చాప్టర్లు, 31 సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రశేఖర్రెడ్డి అవగాహన కల్పించారు. దరఖాస్తులకు సంబంధించి పీఐవోలు, ఏపీఐవోల సందేహాలను నివృత్తి చేశారు. పౌరులు కోరినప్పుడే సమాచారం ఇవ్వడం కాకుండా, సమాచార హక్కు చట్టం, సెక్షన్ 4(1)బి ప్ర కా రం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా సమాయ త్తం కావాలని సూచించారు. సమాచారాన్ని కోరే హక్కు ప్రతి పౌరునికి ఉండడంతోపాటు రికార్డుల ను, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించే అధికారం కూడా ఉందన్నారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులు అనగానే అనేక మంది ఆందోళన కు గురవుతారని, అనుమానాలు, అపోహలకు గురి కాకుండా దరఖాస్తుదారు కోరిన మేరకు రికార్డులలో ఉన్న సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులను ఆర్టీఐ కమిషన్ చీఫ్ కమిషనర్, కమిషనర్లు పరిశీలించి పరిష్కరించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, దిలీప్కుమార్, డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్సింగ్, అదనపు డీసీపీ ప్రకాశ్, డీఆర్వో బి గీత, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రశ్నించే హక్కును ప్రజలకు
సమాచార హక్కు చట్టం కల్పించింది
రాష్ట్ర సమాచార కమిషన్
చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి
ఆర్టీఐ చట్టంపై పీఐవో,
ఏపీఐవోలకు అవగాహన సదస్సు


