● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మర్పల్లి: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలించేందుకు లారీలను అందుబాటులో ఉంచాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. కల్లాల వద్ద ఉన్న రైతులతో మాట్లాడి, ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం వస్తున్న రెండు లారీలు సరిపోవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కలెక్టర్ మాట ఇచ్చిన విధంగా 8 రోజుల్లోగా సేకరణ పూర్తి చేయాలని అన్నారు. బషీరాబాద్ కేంద్రంలో ఇప్పటి వరకు కేవలం 20 శాతం ధాన్యం మాత్రమే లిఫ్ట్ అయిందని, మిగిలిన 80 శాతం ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. లారీల రాకను పెంచాలని జేసీకి సూచించారు. వర్షాల ముప్పు పొంచి ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలింపు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు శ్రీనివాస్ గురువారం జిల్లాకు రానున్నారు. కాంగ్రెస్ భవన్లో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్ష పదవితోపాటు ఇతర కార్యవర్గానికి సంబంధించి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడి నియమాకం నిర్వహించనున్నారు.
నిజామాబాద్ రూరల్: ఆర్టీసీ నిజామాబాద్ డి పో–1లో ఈ నెల 16న కార్గో పార్సిల్స్కు సంబంధించిన వస్తువుల వేలంనిర్వహించనున్న ట్లు మేనేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆస క్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
● అధికారులకు అప్పగింత
నిజామాబాద్ అర్బన్: నగరంలోని బాలసదనం నుంచి పారిపోయిన బాలికను పోలీసులు పట్టుకొని అధికారులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ముగ్గురు బాలికలు బాలసదనంలో ఉండటం ఇష్టం లేక తప్పించుకొని ఇంటికి పారిపోయారు. ఇద్దరు బాలికలు అదే రోజు సాయంత్రం పోలీసులకు పట్టుబడ్డా రు. మూడో బాలిక బుధవారం బాసరలో పట్టుబడింది. మూడో టౌన్ పోలీసులు బాలికను బాలసదనం అధికారులకు అప్పగించారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్నగర్ నాగా టవర్స్లో బుధవారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. 204 ప్లాట్ నంబర్లో నందిపేటలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తించే కొత్తూరు వనజ నివసిస్తున్నారు. ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. 5 తులాల బంగారం, 15 తులాల వెండి, రెండు ఉంగరాలు అపహరణకు గురైనట్లు 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్హెచ్వో సతీశ్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. అపార్ట్మెంట్లో సీసీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ప్లంబర్ పని ఉందని అపార్ట్మెంట్లోకి వచ్చినట్లు గుర్తించారు.


