సుభాష్నగర్: జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వ్యవ సాయ కళాశాలను జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముస్కు సాయిరెడ్డి (మునిపల్లి) కోరారు. ఈ మేరకు జక్రాన్పల్లి మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ.. జక్రాన్పల్లిలో 800 ఎకరాల సారవంతమైన ఎర్ర నేల, భూగ ర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. జాతీయ రహదారికి అతి సమీపంలో ప్రభుత్వ భూమి ఉందని, కళాశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నారు. వాణిజ్య పంటలైన పసుపు, ఎర్రజొన్నలు, సజ్జలు, వరి, మొక్కజొన్న, ఇతర అంతర పంటలు కూడా పండిస్తూ మండలం దేశ వ్యవసాయ చరిత్రలోనే ఎంతో పేరుగాంచిందని తెలిపారు. వ్యవసాయ కళాశాలను జక్రాన్పల్లిలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు.


