సుభాష్నగర్/ నిజామాబాద్ అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
భూమి బదలాయింపుని వెనక్కి తీసుకోవాలి
తెలంగాణ యూనివర్సిటీలో వ్యవసాయ కళాశాలకు కేటాయించిన 100 ఎకరాల భూమి బద్దలాయింపును వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం మాస్లైన్, పీడీఎస్యూ, టీయూసీఐ, పీవోడబ్ల్యూ, పీవైఎల్ సంఘాలు డిమాండ్ చేశాయి. వ్యవసాయ కళాశాలకు ఇతర ప్రభుత్వ భూమిని కేటాయించాలని ప్రజావాణిలో కలెక్టర్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు నరేందర్, వెంకన్న, రాజేశ్వర్, రాజన్న, భూమేశ్వర్, సుధాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పురుగుల మందు డబ్బాతో..
ఆలూరు మండలం డీకంపల్లి గ్రామానికి చెందిన బాధితులు ప్రజావాణికి పురుగుల మందు డబ్బాతో వచ్చారు. డీకంపల్లి గ్రామానికి చెందిన చిన్మల నల్ల కుటుంబాన్ని 2022లో గ్రామస్తులు బహిష్కరించారని, అప్పటి నుంచి తమకు గ్రామంలో ఎవరూ సహకరించడం లేదని బాధితురాలు పేర్కొంది. అవమానంతో తన బావ కూడా చనిపోయినట్లు తెలిపారు. ఈ విషయమై మాక్లూర్ పోలీస్స్టేషన్తోపాటు కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. అయినా తమకు న్యాయం జరగడం లేదని తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే ఉన్న పోలీసులు ఆమె చేతిలోని పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడించి అక్కడి నుంచి పంపించి వేశారు.


