నిజామాబాద్ అర్బన్: మాక్లూర్ మండలం మానిక్భండార్ గ్రామస్తులు బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలివచ్చారు. ఇద్దరు యువకులు మీడియా పేరు చెప్పి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో పలువురిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బైక్ దొంగలకు ఏడాది జైలు
నిజామాబాద్ లీగల్: బైక్ దొంగతనాలను అలవాటుగా మార్చుకున్న ఇద్దరు దొంగలకు నిజామాబాద్ సెషన్స్ కోర్టు జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి ఏడాది కఠిన కారాగార శిక్ష, చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీసు రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా నవ తాలుకా, కాప్సి గ్రామానికి చెందిన సుధ్మాధవ్ టోమ్కే, రెంజల్ మండలం దూపల్లికి చెందిన పూదారి నగేశ్ బైక్ దొంగతనాలను అలవాటుపడ్డారు. నిజామాబాద్ రెండో టౌన్ పరిధిలో బైక్ దొంగతనానికి పాల్పడగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కోర్టుకు అప్పగించారు. నిందితులపై రెండో టౌన్తోపాటు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో బైక్ చోరీ కేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి నిందితులు బైక్ చోరీలకు అలవాటుపడ్డారని గుర్తించి కఠిన కారాగార శిక్షతోపాటు చెరో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
కామారెడ్డి క్రైం:దొంగతనం కేసులో నిందితునికి కా మారెడ్డి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 16న సదాశివనగర్కు చెందిన బంజ సిద్దవ్వ ఇంటికి తాళం వేసి మే డ్చల్ వెళ్లగా దొంగలు పడి రూ.10 వేల నగదు, కొంత బంగారం ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు అదే గ్రామానికి చెందిన ఎంపేట రంజిత్ కు మార్ను నిందితుడిగా గుర్తించి రిమాండ్కు తరలించారు.అప్పటి నుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. సాక్ష్యాలను పరిశీలించిన అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ భట్టు దీక్ష నిందితునికి ఏడాది జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు.కేసును సరైన పద్ధతిలో విచారించిన ఎస్సైలు రంజిత్, పుష్పరాజ్, ఏపీపీ రజినీ,సిబ్బందిని ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో
యాత్రికురాలు మృతి
● విజయనగరం జిల్లా వాసిగా గుర్తింపు
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్ర సమీపంలోని ఇల్చిపూర్ శివారులో గల జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యాత్రికురాలు మృతి చెందింది. దేవునిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా బోండాపల్లి మండలం కంచిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కడియాల రమణమ్మ (55) తన కుటుంబసభ్యులతో కలిసి ఎస్వీఎల్ ట్రావెల్స్ బస్సులో బాసరకు బయల్దేరారు. ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇల్చిపూర్ శివారులో బస్సును నిలిపారు. అదే సమయంలో రమణమ్మ బస్సు దిగి రోడ్డు పక్కన నిల్చుండగా నిజామాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన రమణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
వృద్ధుడు అదృశ్యం
రుద్రూర్: కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అదృశ్యమైనట్లు ఎస్సై సునీల్ తెలిపారు. గ్రామానికి చెందిన ఇట్టె చిన్న హన్మాండ్లు మార్చి 30వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలు ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. కుమారుడు మారుతి బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


