సిరికొండ: మండలంలోని సర్పల్లి తండాలోగల కొత్తకుంట చెరువులో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. సర్పల్లి తండాకు చెందిన మాలావత్ రమేష్(29) అనే యువకుడు ఆదివారం మద్యం మత్తులో తండా శివారులోని కొత్త కుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పత్తిపాకల రాజన్న (59)కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుమారులకు వివాహాలు జరిగాయి. కొంతకాలంగా రాజన్న అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాల కారణంగా మనస్థాపం చెందాడు. దీంతో గత నెల 31వ తేదీన అతడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి పెద్దకొడుకు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


