ధర్పల్లి: మండలంలో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు గ్రామ శివారులోని ఓ సెల్ టవర్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్ (30) గత నెల 31న పని నిమిత్తం ఇంటి నుంచి ఉదయం వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు, చుట్టుపక్కల ఎంత వెతికిన అతడి ఆచూకీ లభించలేదు. దీంతో ఈనెల 1న తన అన్న కనిపించడం లేదని మృతుడి తమ్ముడు శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ శివారులోని ఓ సెల్ టవర్ పక్కన శనివారం రాజశేఖర్ మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ భిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ తెలిపారు.


