నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం నగరంలోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కే. రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి ఒకటికి ముందు తర్వాత పదవీ విరమణ పొందిన వారిని విభజిస్తూ వర్గీకరణ చేయడం ద్వారా 7 వ వేతన సవరణ సంఘం ప్రయోజనాలను పరిమితం చేయాలనే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షనర్ల సంఘ నాయకులు ప్రతాప్ రెడ్డి, హుస్సేన్, బాల దుర్గయ్య, గంగాధర్, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు లావు వీరయ్య, చంద్రశేఖర్, డి లక్ష్మీనారాయణ, పుష్పవల్లి,మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని బుధవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పండరినాథ్ ఆధ్వర్యంలో పెన్షనర్ల భవనం ముందు విశ్రాంత ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్కు వెళ్లి ఏవో ప్రశాంత్కు వినతిపత్రం అందజేశారు. అధ్యక్షులు పండరినాథ్ మాట్లాడారు. జిల్లా కార్యదర్శి గంగా కిషన్, ఫైనాన్స్ కార్యదర్శి రవీందర్ రెడ్డి, స్వామిదాస్, గౌరవ అధ్యక్షులు భుజాగౌడ్, అడ్వైజర్ సాయిలు, తాలూకా అధ్యక్ష కార్యదర్శులు జగత్రెడ్డి, దయాకర్ రావు, ఫైనాన్స్ కార్యదర్శి గంగాధర్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.


