● పూర్తిస్థాయి కొనుగోళ్ల కోసం రెండు రోజుల్లో అనుమతి వచ్చే అవకాశం
● మార్క్ఫెడ్ డీఎం మహేశ్కుమార్
బోధన్: శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్కుమార్ అన్నారు. ‘శనగ రైతులకు సెగ’ శీర్షికన ఈనెల 25వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. సాలూర, కల్దుర్కిలోని కొనుగోలు కేంద్రాలతోపాటు బోధన్ సొసైటీ పరిధిలోని మావందికుర్దూలోని కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ డీఎం బుధవారం సందర్శించారు. కొనుగోళ్ల తీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయని ఆరా తీశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల వరకే శనగలు కొనుగోలు చేయాలనే నిబంధన కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, సేకరణ పరిమితిని 10 క్వింటాళ్లకు పెంచాలని రైతులు కోరగా, సమస్యను వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డీఎం అన్నారు. జిల్లాలో లక్షా 40వేల క్వింటాళ్ల శనగ దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ నివేదించిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తొలుత 24 వేల 850 క్వింటాళ్ల శనగల కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మిగిలిన శనగ నిల్వలను కొనుగోలు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించామని, మరో రెండు రోజుల్లో అనుమతి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. డీఎం వెంట బోధన్ సొసైటీ సీఈవో ఉమాకాంత్, ఉద్యోగులు, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.


