దోమకొండ: మండలంలోని చింతమాన్పల్లి గ్రామంలో ఆదివారం ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయగా, వారు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు హర్షిని, జాహ్నవిల తల్లిదండ్రులు తమ ఇంటి దగ్గరలోని ఖాళీ స్థలంలో మొక్కజొన్న కంకులకు ఒలుస్తున్నారు. దీంతో వీరు ఇంటి నుంచి ఆడుకుంటూ తమ తల్లిదండ్రుల వద్దకు వెళుతుండగా, కుక్కలు రోడ్డుపై వెంటపడి వీరిని తీవ్రంగా గాయపర్చాయి. హర్షినికి కంటిపై తీవ్ర గాయాలు కాగా, జాహ్నవికి కాలుపై గాయాలైయ్యాయి. దీనిని గమనించిన వీరి తండ్రి నారం యశ్వంత్ వెంటనే చికిత్స కోసం ముందుగా కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నీలోఫల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి బాగానే ఉందని గ్రామస్తులు తెలిపారు. కాగా చిన్నారులను గాయపర్చిన కుక్కలను గ్రామస్తులు కర్రలతో దాడి చేసి చంపివేశారు. రోజురోజుకు గ్రామల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వీటి నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ నగర్కు చెందిన అటకారి సాగర్ ఈ నెల 20 నుంచి కనబడుట లేదని రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకేంద్రంలో పని ఉందని చెప్పి అతడు వెళ్లాడని ఇప్పటికీ తిరిగి రాలేదని అన్నారు. అప్పల బాధతో సాగర్ ఎక్కడికై న వెళ్లి ఉండవచ్చని అతని భార్య అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వివరించారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఆదివారం దాడి చేసి పేకాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.13,910, 4బైక్లు, 5సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడైన పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.


