బోధన్: హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణకు ఐక్యంగా ముందుకెళ్లాలని కామారెడ్డి జిల్లా బిచ్కుంద సంస్థాన మఠాధిపతి షట్స్థల బ్రహ్మ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామిజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణంలోని గంజ్ రోడ్లో గల రాధాకృష్ణ మందిరం (సాయిబాబా ఆలయం) ప్రాంగణంలో ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. స్వామీజీ ముఖ్య అథితిగా విచ్చేసి, ప్రవచనాలు చేశారు. చిరుప్రాయం నుంచే తమ పిల్లలను ఆధ్యాత్మిక మార్గంలో నడిచే విధంగా చూడాలన్నారు. ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ సహ చాలక్ పాలేటి వెంకట్రావు, ఆర్య వైదిక ధర్మప్రచారక్ ఉత్తూరు పద్మ మాట్లాడుతూ.. హిందూ బంధువులందరూ ధర్మ రక్షణకు ఐక్యతను, సమరసతను చాటాలన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళన కార్యక్రమం కొనసాగుతున్నాయని వెంకటరావు తెలిపారు. విశ్రాంత తహసీల్దార్ మురహరి, కమిటి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


