ఆస్పత్రిలో చిన్నారి మృతి
● రేబిస్ వ్యాక్సిన్ వికటించడం వల్లేనని కుటుంబ సభ్యుల ఆరోపణ
● మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన
కామారెడ్డి టౌన్: ఆ చిన్నారికి రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. కుక్క కాటుకు వ్యాక్సిన్ తీసుకున్న ఆ బాలిక.. కొద్దిసేపటికి తండ్రి భుజాలపైనే కన్ను మూసింది. దీంతో తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకుని రాగానే దేవు ని చెంతకు వెళ్లావా చిట్టి తల్లి అంటూ ఆ తండ్రి రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. కామారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి.
జిల్లా కేంద్రంలోని అయ్యప్ప నగర్లో నివాసం ఉంటున్న కల్లూరి అర్చన రమేష్ దంపతులకు 9 ఏళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు క్రితర్ష ఉన్నారు. గత నెల 25న పాప ఇంటి ముందు ఆడుతుండగా వీధి కుక్క కరిచింది. దీంతో అదేరోజు స్థానిక జీజీహెచ్లో రేబిస్ వ్యాక్సిన్ మొదటి డోసు, 28న రెండో డోసు ఇప్పించారు. ఆదివారం మధ్యాహ్నం మూడో డోసు ఇప్పించిన కొద్దిసేపటికే పాప తల మెడ కిందకు వాల్చేసి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే పాపను తండ్రి రమేష్ ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మర ణవార్త విన్న మృతురాలి బంధువులు వందలా ది మంది జీజీహెచ్కు చేరుకుని ఆందోళన చేశా రు. చిన్నారి మృతదేహంతో ఎమర్జెన్సీ వార్డు లో బైఠాయించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని ఆరోపిస్తూ వైద్యులు, సి బ్బందిపై దాడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని వైద్యులను ఓ గదిలో ఉంచి రక్షణ కల్పించారు. సుమారు 4 గంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వ డంతో ఆందోళనకారులు శాంతించారు.


