కిడ్నాప్, చోరీ కేసులో నిందితుల అరెస్టు
● నగదు, కారు స్వాధీనం
నిజామాబాద్అర్బన్: ఓ వ్యక్తిని కిడ్నాప్చేసి, అతడి వద్దనుంచి నగదును కాజేసిన ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సురేష్, మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. నగరంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన బంగారం వ్యాపారి అనిల్ పాటిల్ జనవరి 23న తన వద్ద పనిచేసే గంగాధర్కు రూ.19,20,000 నగదును ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయాలని తెలిపాడు. దీంతో అతడు నగదుతో బ్యాంకుకు వెళ్తుండగా, నలుగురు దుండగులు కారులో వచ్చి, అతడిని కిడ్నాప్ చేశారు. బాసర వద్ద అతడిని విడిచిపెట్టి, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై అనిల్ పాటిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన వినోద్ శంకర్ పవర్, అమర్ దామోదార్చర్వాద్, నౌషద్ఖాదార్సయ్యద్ లను అరెస్టు వారి వద్ద నుంచి డబ్బులు, కారును రికవరీ చేశారు. మరోవ్యక్తి పరారీలో ఉన్నాడని, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


