పొరపాట్లకు తావుండొద్దు
మోపాల్(నిజామాబాద్రూరల్): నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గ్రామ పంచాయతీ రెండోవిడత ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలతోపాటు జక్రాన్పల్లి మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్ర క్రియ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమ వారం మోపాల్ మండలం కులాస్పూర్, జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశా రు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, మొదటి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్డె స్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్డెస్క్ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.


