బోధన్: నిజామాబాద్ జిల్లా మంజీర నది తీర ప్రాంతంలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో భీతావహ వాతావరణం ఏర్పడింది. సాలూర మండల కేంద్రం, ఖాజాపూర్, హున్సా, మందర్నా గ్రామా ల్లో వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.
ఈ గ్రామాల్లో యాసంగి సీజన్లో వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న సాగు చేశారు. పంటలు కోత దశకు చేరాయి. వర్షానికి మొక్కజొన్న నేలవాలింది. వరిపంట గింజ రాలిపోయింది. సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతు సేవా కేంద్రం ఆవరణలో, అంతర్రాష్ట్ర బైపాస్ రోడ్డు మార్గం, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది.


