
కేంద్ర నిధుల జాప్యంతోనే..
నిజామాబాద్ సిటీ : రాష్ట్రంలో ఆర్వోబీలు, పలు అభివృద్ధి పనులు కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్లనే మందకొడిగా సాగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతోందని, వ్యవసాయ కళాశాల, ఫామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి సముఖంగా ఉన్నారన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్బీ అతిథిగృహంలో మహేశ్ కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ముంబయి, వయా నిజామాబాద్ డబుల్ రైల్వేలైన్ విషయం ముఖ్యమంత్రితో చర్చించినట్లు మహేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ గర్జన సభ ఉంటుందన్నారు. అర్హులైనవారిని డీసీసీ అధ్యక్షులుగా ఎంపికచేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, బీసీ రిజర్వేషన్లు అమలుచేసి తీరతామని అన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళతామన్నారు. రాహుల్గాంధీ ఆలోచనల మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసీ్త్రయ పద్ధతిలో కులగణన చేశారన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఫైల్, మరో రెండు బిల్లులు సైతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, కిషన్రెడ్డి వంటి వారు కేంద్రంలో రాష్ట్రానికి రావలసిన నిధులపై ప్రధానితో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బనక చర్ల విషయంలో మాజీమంత్రి హరీశ్రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవోలు తెచ్చారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీటిచుక్కను కూడా వదిలే ప్రసక్తి లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర సహకార సంఘాల సొసైటీ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ నగేష్రెడ్డి పాల్గొన్నారు.
ఆర్వోబీ, అభివృద్ధి పనులకు ఆటంకం
జిల్లాలో వ్యవసాయ కళాశాల
ఏర్పాటుకు సీఎం సుముఖత
42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే
స్థానిక ఎన్నికలు
అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్