
లక్షల క్యూసెక్కుల వరద
● ఓ దశలో 3లక్షల క్యూసెక్కులు దాటి..
● ఎస్సారెస్పీలోకి పోటెత్తిన ఇన్ఫ్లో
● 39 గేట్ల ద్వారా గోదావరిలోకి
1.85 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
ఎస్సారెస్పీలో ప్రస్తుత నీటి మట్టం
బాల్కొండ: మహారాష్ట్రతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 లక్షల 15 వేల క్యూసెక్కులుగా కొనసాగిన ఇన్ఫ్లో రాత్రికి లక్షా 92 వేలకు తగ్గింది. గురువారం ఉదయం 6 గంటలకు 2 లక్షల 48 వేల క్యూసెక్కులకు పెరిగింది. క్రమంగా పెరిగిన ఇన్ఫ్లో మధ్యాహ్నం సమయానికి 3 లక్షల 10 వేల క్యూసెక్కులకు చేరి సాయంత్రం వరకు అదే స్థాయిలో కొనసాగింది. రాత్రి సమయానికి 2.75లక్షలకు తగ్గింది. 39 వరద గేట్ల ద్వారా లక్షా 85 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టాన్ని అధికారులు భారీగా తగ్గించారు. వరద కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.701 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది.