
గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు గురువారం ఉదయం నిలిపివేశారు. బుధవారం రాత్రికి ప్రాజెక్ట్లోకి వరద నీరు పోటెత్తడంతో గోదావరిలో 75 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. తర్వాత క్రమంగా నీటి విడుదలను తగ్గించారు. గురువారం ఉదయం పూర్తిగా నీటి విడుదలను నిలిపి వేశారు. ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు ప్రాజెక్ట్లోకి 385 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అందులో 245 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు , సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 270 క్యూసెక్కులు, అలీసాగర్ లిప్టు ద్వారా 360 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి అంతేస్థాయి నీటిమట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.