ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు జీపీ కార్మికుల మృతి
● విద్యుత్ స్తంభాలు తరలిస్తుండగా ఘటన
బోధన్రూరల్: బోధన్ మండలం బిక్నెల్లీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు జీపీ కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలు ఇలా.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బిక్నెల్లీ గ్రామ శివారులోని పొలాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో కొత్త స్తంభాలను తీసుకురావడానికి జీపీ డ్రైవర్ రాజు (అవుట్ ఓర్సింగ్), జీపీ కార్మికులు బాగారే బాలాజీ (42) (మల్లీపర్పస్ వర్కర్), బాగారే యాదు (40) (ఔట్సోర్సింగ్ వర్కర్) గురువారం రాంపూర్ సబ్సేష్టన్కు వెళ్లారు. అక్కడి నుంచి ట్రాక్టర్పై విద్యుత్ స్తంభాలను తీసుకొని గ్రామానికి బయలుదేరారు.
కల్దుర్కి శివారులో ఓవర్ లోడ్ కారణంతో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ను నడిపిస్తున్న రాజు గాయాలతో బయటపడగా, ట్రాలీలో ఉన్న బాగారే బాలాజీ, బాగారే యాదుపై స్తంభాలు పడటంతో అక్కడిక్కడే మృతి చెందారు. బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జీపీ కార్యదర్శి సుధాకర్ ఆదేశాల మేరకే జీపీ సిబ్బంది ట్రాక్టర్లో స్తంభాలను తరలించారని ప్రచారం జరుగగా, ఘటనపై వివరాల కోసం జీపీ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.
గుండెపోటుతో టీఏ మృతి
బాల్కొండ: మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ధనుంజయ్(45) గుండెపోటుతో మృతిచెందారు. విధుల్లో భాగంగా గురువారం ధనుంజయ్ బైక్పై బస్సాపూర్ గ్రామానికి బయలుదేరాడు. గ్రామంలో పర్యటిస్తుండగా అస్వస్థతకు గురై గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానికులు అతడిని చికిత్సకు తరలించేలోపు మృతి చెందాడు. సమయానికి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒత్తిడికి గురికావడంతోనే ధనుంజయ్కి గుండెపోటు వచ్చిందని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య
ఎల్లారెడ్డి: ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సబ్దల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. సబ్దల్పూర్ గ్రామానికి చెందిన బత్తుల సావిత్రి (20) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి తండ్రి రాంచందర్ ఇంటికి రాగా, ఉరివేసుకున్న కూతురును చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. సావిత్రికి లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నదని, అతడు నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాంచందర్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై యువకుడు..
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గూపన్పల్లిలో ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. గూపన్పల్లికి చెందిన చింతకుంట రాజు(30) ఆటోడ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా రాజు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల కారణంగా తాగుడుకు బానిసయ్యాడు. ఈక్రమంలో గురువారం తీవ్ర మనస్తాపానికి గురై, ఇంటిలో ఎవరు లేని సమయంలో రాజు ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వివరించారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్
క్రైం కార్నర్