రూరల్‌ నియోజకవర్గంలో వరద బీభత్సం | - | Sakshi
Sakshi News home page

రూరల్‌ నియోజకవర్గంలో వరద బీభత్సం

Aug 29 2025 6:38 AM | Updated on Aug 29 2025 6:38 AM

రూరల్

రూరల్‌ నియోజకవర్గంలో వరద బీభత్సం

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, మోపాల్‌ మండలాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగులు ఎత్తిపోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో చెరువులు తెగి ఊళ్లల్లోకి వరద నీళ్లు చేరాయి. ధర్పల్లి మండలంలో వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలను రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య పరిశీలించారు. ముంపు బాధితులకు పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించి భోజనం అందించారు. డిచ్‌పల్లి మండలంలోని కొరట్‌పల్లి–కొరట్‌పల్లి తండాకు, కొరట్‌పల్లి–మైలారం గ్రామాల మధ్య అధికారులు రాకపోకలను నిలిపివేశారు. బర్ధిపూర్‌ చె రువు నిండి అలుగు పారడంతో ఒడ్డున ఉన్న బర్ధిపూర్‌, ధర్మారం(బి) గ్రామాల్లోని ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. బాధితులను స్థానిక పునరావాస కేంద్రంలోకి తరలించారు.

సిరికొండ మండలంలో కప్పల వాగు, మొండి వాగు, మద్దెల వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు పరిసరాలల్లో పంటపొలాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వాగు పరిసర గ్రామాలైన తూంపల్లి, గడ్కోల్‌, కొండూర్‌, పెద్దవాల్గోట్‌, చిన్న వాల్గోట్‌ గ్రామాలను వరద ముంచెత్తింది. కొండాపూర్‌–తూంపల్లి గ్రామాల మధ్య కల్వర్టు కొట్టుకుపోయింది. మొండివాగు బ్రిడ్జి వద్ద వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి.

ధర్పల్లి మండలంలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో కప్పల వాగులోకి వరద పోటెత్తింది. దీంతో కప్పలవాగు బ్రిడ్జి వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. సమీప గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చిచేరింది. వాడి, బీరప్ప తండాలో పంట నష్టం భారీగా జరిగింది. ముంపునకు గురైన వాడి గ్రామాన్ని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య సదర్శించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇందల్వాయి మండలంలో గన్నారం చిన్నవాగు ఉధృతికి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వరద నీటిలో చిక్కుకుంది. సిర్నాపల్లి గ్రామం రామ్‌సాగర్‌ తండా చెరువు తెగిపోయి వరద నీటిలో స్వర్గరథం కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. సిర్నాపల్లి– గన్నారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

జక్రాన్‌పల్లి మండలంలోని కలిగోట్‌–చింతలూరు గ్రామాల వద్ద పెద్ద వాగు వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహించడంతో రెండు గ్రామాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి.

మోపాల్‌ మండలంలో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. ఎల్లమ్మకుంట వెళ్లే రోడ్డును అధికారులు మూసివేశారు.

నిజామాబాద్‌రూరల్‌ మండలంలోని పాంగ్రాలో నివసిస్తున్న కొందరు వరద బాధితులను నగరంలోని బింగి కల్యాణ మండపంలో పునరావాస కేంద్రానికి తరలించారు. గూపన్‌పల్లి శివారులో పులాంగ్‌వాగు వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేశారు. ముత్తకుంట– కుర్నాపల్లి గ్రామాల మధ్య వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు

కోతకు గురైన రహదారులు

పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ముంపు గ్రామాలను సందర్శించిన

అధికారులు

రూరల్‌ నియోజకవర్గంలో వరద బీభత్సం 1
1/1

రూరల్‌ నియోజకవర్గంలో వరద బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement