నిర్మల్టౌన్: క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేసి త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జడ్జి శ్రీవాణి తెలిపారు. హైకోర్టు మార్గదర్శకాల మేరకు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా ప్రధాన కోర్టులో శనివారం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల పురోగతి, అండర్ ట్రయల్ ఖైదీల కేసుల త్వరిత విచారణ, చార్జ్ షీట్లను సకాలంలో దాఖలు చేయడం, సాక్షుల హాజరును నిర్ధారించడం, కోర్టు సమన్లు, వారెంట్లను వెంటనే అమలు చేయడం, నాణ్యమైన దర్యాప్తుతో పటిష్టమైన సాక్ష్యాధారాలను సమర్పించడం వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు పోలీసు, ప్రాసిక్యూషన్, న్యాయస్థాన అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్, న్యాయస్థానాల మధ్య సమన్వయం కీలకమన్నారు. ప్రతీ దర్యాప్తు అధికారి చట్టపరమైన ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, కోర్టు ఆదేశాల అమలులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాసీ్త్రయ ఆధారాలతో నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి భవిష్య, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి నిఖిత, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, జైలర్ సూర్యప్రకాశ్రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు, ఎస్సైలు, సీడీవోలు, న్యాయస్థాన, అధికారులు పాల్గొన్నారు.


