నిర్మల్: జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఈ ఏడాది జనవరి 16న నిర్మల్లో నిర్వహించి న సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. తాత్కాలికంగా బాసర ట్రిపుల్ఐటీలో వర్సిటీని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజాపాలన సభలో సీఎం స్వయంగా ఈ హామీ ఇవ్వడంతో జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆరునెలలు దాటినా ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. స్థలం ఎంపిక, నిధుల కేటాయింపు, పరిపాలనా ఏర్పాట్లు వంటి అంశాల్లోనూ ఎలాంటి పురోగతి లేదు. దీంతో హామీకే పరిమితమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయమై ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవడంతో ప్రజల్లో నిరాశ పెరుగుతోంది.
ఆరునెలలు.. ఏవీ అడుగులు!
హామీ ఇచ్చి ఆరునెలలు గడిచినా ప్రభుత్వం నుంచి యూనివర్సిటీ ఏర్పాటుకు జీవో విడుదల కాలేదు. విశ్వవిద్యాలయం పేరుపై, నిర్వహణపై, కోర్సులపై, తాత్కాలిక కేంద్రంపై కూడా స్పష్టత లేదు. సంబంధిత ఉన్నత విద్యాశాఖ నుంచి ఎలాంటి ప్రకటనలు, కాన్సెప్ట్ నోట్, డీపీఆర్.. అసలు ఎలాంటి కదలికలూ లేకపోవడంతో ఈ హామీ కూడా ఇతర హామీల మాదిరిగానే మరుగున పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాకు అవసరం..
నిర్మల్తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నతవిద్య అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు పీజీ, ఉన్నతవిద్య, పరిశో ధ న కోర్సుల కోసం హైదరాబాద్, వరంగల్, నిజా మాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా విశ్వవిద్యాలయం ఏర్పడితే వేలాది మంది విద్యార్థులకు ఉన్నత, ఉపాధినిచ్చే విద్యలు అందుబాటులోకి వస్తాయి. వర్సిటీ రావడంతో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలకు, పరిశోధనలు, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
పాలకుల మౌనం..
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు సీఎం ఇచ్చిన హామీ అమలుపై ఇప్పటివరకు బహిరంగంగా ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ఉన్నత విద్యాశాఖతో సమీక్షలు నిర్వహించడం, కాలపరిమితి నిర్ణయించేలా ప్రయత్నించడం వంటి చర్యలు కనిపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. హామీ అమలు కోసం ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు చొరవ చూపాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది.
జిల్లాలో పరిస్థితి తెలిపే
ఏఐ చిత్రం
సీఎం ప్రకటనతో సర్వత్రా హర్షం..
కొన్నేళ్లుగా చదువులతల్లి కొలువైన నిర్మల్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ఇదేక్రమంలో సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు విశ్వవిద్యాలయం అవసరాన్ని గుర్తిస్తున్నామని చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. పూర్తి స్థాయి క్యాంపస్ ఏర్పాటుకు కొంత సమయం పట్టే అవకాశం ఉ న్నందున.. అప్పటి వరకు బాసర ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావుల్లో ఆశలు చిగురించాయి.


