ఖానాపూర్: ఏడాది కాలంగా పాలకవర్గం లేకుండా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన ఖానాపూర్ మున్సిపాలిటీలో ఇటీవల ఎన్నికైన పాలకవర్గం సాధారణ సమావేశం బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరుగనుంది. పట్టణంలోని పలు సమస్యలు పరిష్కారంపై తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారా అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. చైర్పర్సన్ మౌనిక ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. సభ్యులు సకాలంలో రావాలని కోరారు. ఈ సమావేశంలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు వంటి ప్రాధాన్య సమస్యలపై తీర్మానాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు సమావేశమయ్యే కార్యాలయ గది శిథిలావస్థలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గది పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో తొలి సమావేశంలోనే కార్యాలయ భవనం మరమ్మతులు లేదా కొత్త భవనం నిర్మాణంపై చర్చ జరిగే అవకాశం
ఉందని సమాచారం.


