న్యూస్రీల్
పీఏసీఎస్లకు ఎన్నిక లేకుండా పాలకమండళ్లు ముగ్గురు లేదా ఐదుగురు డైరెక్ట్ నియామకం ప్రత్యేకాధికారుల పాలనకు సెలవు
నిర్మల్
కలెక్టరేట్లో వాసవీమాత జయంతి వేడుకలు
నిర్మల్చైన్గేట్: వాసవీమాత జయంతి వేడుకలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముందుగా ఆయన పలువురు అధికారులు, సంఘాల నాయకులతో కలిసి వాసవీమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. వేడుకల్లో డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, సంఘ నాయకులు పాల్గొన్నారు.
నిర్మల్చైన్గేట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలనలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఎన్నికల ద్వారా నియమితులయ్యే పాలకవర్గాల స్థానంలో, ఇకపై నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎన్నికల ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది.
నామినేటెడ్ వెనుక వ్యూహం..
గతంలో జరిగిన ఎన్నికల విధానం స్థానంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిని అమలు చేయడం ద్వారా అధికార పార్టీ తన క్షేత్రస్థాయి శ్రేణులను సంతృప్తి పరచాలని యోచిస్తోంది. సహకార చట్టం ప్రకారం, ప్రతీ పీఏసీఎస్ పాలకవర్గంలో చైర్మన్, వైస్చైర్మన్తో పాటు మొత్తం 13 మంది సభ్యులు ఉండాలి. అయితే, ప్రస్తుత నియామకాల్లో ఒక్కో సంఘానికి ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన పాలకమండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల నిబంధనలను పాటిస్తూనే, పార్టీకి విధేయులుగా ఉన్న వారికి ఈ పదవులను కేటాయించేందుకు ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు కసరత్తు ప్రారంభించారు.
సహకార వ్యవస్థలో మార్పులు
గతంలో రైతు ఓటు ద్వారా ఎన్నికై న డైరెక్టర్లు తమ చైర్మన్ను ఎన్నుకునే విధానం ఉండేది. ఇది గ్రామీణ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఒక బలమైన అనుబంధాన్ని ఏర్పరిచేది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో, ఈ ఎన్నికల ప్రక్రియకు స్వస్తి పలికి నేరుగా పదవులను భర్తీ చేయడం వల్ల పాలనాపరంగా ఎలాంటి మార్పులు వస్తాయనేది వేచి చూడాలి. ఏదేమైనా, ఈ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ అధికార పార్టీలో నెలకొన్న నిరాశను తొలగించి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందు కు ప్రభుత్వం వేస్తున్న ముందడుగుగా కనిపిస్తోంది.
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాల్లో పదవులు దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తీవ్ర పోటీ పడుతున్నారు. మే నెలాఖరుకల్లా నియామకాలను పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో, పదవుల కోసం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో లాబీయింగ్ మొదలు పెట్టారు. ఈ నియామకాలు కేవలం పీఏసీఎస్లకే పరిమితం కాకుండా, డీసీసీబీ, డీసీఎంఎస్ స్థాయిల్లో కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో జిల్లా నేతల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని పీఏసీఎస్ చైర్మన్ల రూపంలోనే 17 మందికి అవకాశం దక్కనుంది.


