నర్సాపూర్(జి): కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం మండలంలోని తిమ్మాపూర్ (జి), గొల్లమాడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తిమ్మాపూర్ (జి)లో రూ. 20 లక్షలతో జీపీ భవనం, రూ.10 లక్షలతో పాఠశాల ప్రహరీ నిర్మాణం, రూ.30 లక్షలతో సీసీరోడ్లు, రూ.30 లక్షలతో గోదాం నిర్మాణం, గొల్లమాడలో రూ.24 లక్షలతో పెద్ద చెరువు అలుగు, చెరువు కట్ట మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ (జి) సర్పంచ్ ఆలూర్ రాజేందర్, గొల్లమాడ సర్పంచ్ చెన్న వసంత లస్మయ్య , ఉప సర్పంచులు కొత్తపల్లి నరేష్, బట్టి భూమన్న, పీఆర్ డీఈ తుకారాం, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏపీవో జగన్నాథ్, ఇరిగేషన్ ఏఈ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.


