అర్జీలు పెండింగ్‌లో పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో పెట్టొద్దు

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ● యూనివర్సిటీ ఏర్పాటు వేగవంతం చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజల నుంచిఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తుల సమస్యలు పరిష్కరించాలన్నారు. 80 దరఖాస్తులను కలెక్టర్‌ స్వీకరించారు.

సంక్షేమ వారోత్సవాలు నిర్వహించాలి..

ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ అధికారి సంక్షేమ వసతి గృహాల్లో నిర్వహించే సంక్షేమ వారోత్సవాల్లో పాల్గొనాలన్నారు. అనంతరం ఇంటర్నేషనల్‌ మదర్‌ ఎర్త్‌ డే–2026 గోడ ప్రతులు ఆవిష్కరించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

బాసరలో ప్రకటించిన నూతన యూనివర్సిటీ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఏటా సుమారు 4 వేల మంది విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తున్నారు. పీజీ సౌకర్యం లేక పైచదువులకు దూరమవుతున్నారు. కూలీ పనులకు లేదా తక్కువ జీతాల ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పీజీ సెంటర్‌ను పునరుద్ధరించి, కొత్త కోర్సులు ప్రారంభించాలి. నిర్మల్‌ పీజీ సెంటర్‌ భవనాన్ని పూర్తిస్థాయిలో విద్యార్థులకే కేటాయించాలి.

– సయ్యద్‌ హైదర్‌, రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీ,

ఆమ్‌ ఆద్మీ పార్టీ

Advertisement
 
Advertisement
Advertisement