నిర్మల్టౌన్: అర్జీదారుని నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా పోలీసులు ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల జిల్లా పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఎండలపై అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా కొనసాగుతోంది. రాబోయే 3–4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. అనవసరంగా బయటకు రావడం తగ్గించాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళితే తప్పనిసరిగా వాటర్ బాటిల్స్, మజ్జిగ, ఓఆర్ఎస్ వెంట తీసుకెళ్లాలని సూచించారు. తలపై క్యాప్ పెట్టుకోవాలని, డీహైడ్రేషన్కు గురికాకుండా చూసుకోవాలని తెలిపారు. వేసవిలో దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


