సారంగపూర్: స్వర్ణ గ్రామంలో ఆశ్రమ పాఠశాలను ప్రజాపాలన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. వంటగదికి వెళ్లి మెనూ ప్రకారం భోజనం వండిపెడుతున్నారా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. మెనూలో సూచించిన విధంగా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల విషయంలో అశ్రద్ధ చేస్తే సహించేది లేదన్నారు. అక్కడి నుంచి తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను మెనూ గురించి అడిగారు. ప్రతీరోజు మెనూ పాటిస్తున్నారా.. భోజనం రుచిగా ఉంటుందా అని ఆరా తీశారు. గణితశాస్త్రం ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ వెంట డీఈవో భోజన్న, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, ఎంఈవో మహేందర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


