నిర్మల్టౌన్: వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సిబ్బంది, పేషంట్లకు శుక్రవారం అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయన్నారు. ఈ క్రమంలో విద్యుత్ సంబంధిత అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని , జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను ఓవర్ రోడ్ చేయకుండా జాగ్రత్త పడాలన్నారు. షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, ఫ్యాక్టరీలు, రద్దీగా ఉండే ప్రాంతాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్ర మాదం సంభవిస్తే వెంటనే 101,100 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ అధికారి శివాజీ, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.


