నిర్మల్టౌన్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి, సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు అసౌకర్యం కలగకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బందులు కలుగకుండా కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయాలు లేకుండా తగినన్ని గన్నీ సంచులు, తూకపు యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించిన చెక్లిస్ట్ ప్రకారం సామగ్రి సమగ్రంగా ఉందో లేదో పరిశీలించి, పరికరాలు సక్రమంగా పనిచేసేలా ముందస్తు తనిఖీలు చేయాలని సూచించారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని, ధాన్యం స్వీకరణలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, పౌర సరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, మార్క్ఫెడ్ ప్రతినిధులు మహేశ్, మిలర్స్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


