సారంగపూర్: ప్రజలు రహదారిపై ప్రయాణించి క్షేమంగా ఇళ్లు చేరాలంటే తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల అన్నారు. మండలంలోని ధని గ్రామంలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్–అలైవ్పై ప్రజలకు అవగాహన కల్పించారు. నిత్యం పేపర్లలో, వార్తల్లో రోడ్డు ప్రమాదాల గురించి చదువుతూ, వింటూనే ఉన్నామన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ఒకసారి తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో నడిపే వ్యక్తితోపాటు ఎదురుగా వచ్చేవారు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీరోజు వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తామని, ప్రతీ వాహన చోదకుడు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. రవాణాశాఖ, పోలీస్శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, ఎస్డీపీవో సాయికిరణ్ ఐపీఎస్, ఏఎంసీ చైర్మన్ అబ్దుల్హాది, సర్పంచ్ పోతన్న, సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్, తహశీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


