భైంసాటౌన్: పశ్చిమాసియా యుద్ధం ఆగింది. రెండు వారాల సీజ్ఫైర్ ఒప్పందంతో ఇరువైపులా దాడులు ఆగాయి. యుద్ధం ఆగకముందు నుంచే భారత్కు ఎల్పీజీ నౌకలు వస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తోంది. అయినా నిర్మల్ జిల్లాలో మాత్రం గ్యాస్ కష్టాలు తీరడం లేదు. సరఫరాలో జాప్యమా.. ఏజెన్సీల నిర్లక్ష్యమా తెలియదు కానీ వినియోగదారులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. సిలిండర్ల కోసం రోజుల తరబడి గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు కొరత లేదని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఓటీపీ వచ్చినా డోర్ డెలివరీ చేయడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ వాసులు గ్యాస్ ఏజెన్సీ గోదాం వద్దకే వెళ్లి సిలిండర్లు తెచ్చుకుంటుండగా, గ్రామీణ ప్రాంతాల ప్రజలు దూరభారంతోపాటు వ్యయభారమవుతోందని చెబుతున్నారు. వంటగ్యాస్ కోసం ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా.. సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు.
మూడు రోజులుగా నో స్టాక్..
భైంసా పట్టణంలోని మైత్రి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నో స్టాక్ బోర్డు పెట్టి, మూడు రోజులుగా ఏజెన్సీ మూసి ఉంచుతున్నారు. ప్రతీరోజు వినియోగదారులు సిలిండర్ కోసం రావడం, నో స్టాక్ బోర్డు చూసి తిరిగి వెళ్లి పోతున్నారు. శుక్రవారం పట్టణంలోని పార్డి(బి) బైపాస్ రోడ్ సమీపంలో, భైంసా–నిర్మల్ హైవేపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. ఏజెన్సీ తెరిపించి టోకెన్లు ఇప్పించడంతో వినియోగదారులు ఆందోళన విరమించారు.
పట్టించుకోని అధికారులు..
జిల్లాలో వంటగ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. వినియోగదారులు ఆందోళన చేసినప్పుడు, మీడియాలో కథనాలు ప్రచురితమైన సందర్భాల్లో నామమాత్రంగా ఏజెన్సీలు సందర్శించి వెళ్లిపోతున్నారు. ఏజెన్సీల్లో నో స్టాక్ అంటూ నే, మరోవైపు బహిరంగంగా వంటగ్యాస్ బ్లాక్లో లభ్యమవుతుండడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు వదులుకుని ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నామని పేర్కొంటున్నారు. ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు.
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా..
గ్యాస్ ఏజెన్సీలు 16
మొత్తం గ్యాస్ కనెక్షన్లు 2,51,785


