లక్ష్మణచాంద: వారం పది రోజుల్లో వరి పంటలు కోతకు రానున్నాయని, ఈ సమయంలో నీళ్లు వస్తే కోతలకు ఇబ్బంది అవుతుందని సంఘంపేట్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘంపేట్ చెరువుకు ఎగువన ఉన్న సరస్వతి కాలువకు గండి పడడంతో నీళ్లు చెరువులోకి వస్తున్నాయని రైతులు అంటున్నారు. దీంతో చెరువు పూర్తిగా నిండి మత్తడి పోస్తోందని, ఈ నీరంతా పొలాల్లోకి చేరితే పంటలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఈమేరకు గురువారం చెరువు అలుగు వద్ద నిరసన తెలిపారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ మధుకర్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా సంఘంపేట్ గ్రామ సమీపంలో సరస్వతి కాలువ మత్తడి వద్ద గండి పడిందన్నారు. వడ్యాల్ చెరువులోకి నీటిని నింపడానికి వడ్యాల్ వద్ద సైఫన్ వద్ద గేట్లు పైకి ఎత్తి దిగువకు నీళ్లు వెళ్లేలాగా చర్యలు చేపట్టి సంఘంపేట్ చెరువులోకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


