నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల ఫిర్యాదులు స్వయంగా స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూసమస్యపై ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
నీటి సమస్య తలెత్తకుండా చూడాలి..
ప్రజావాణి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య ఉండే ప్రాంతాలు గుర్తించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలు తనిఖీ చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు యూరియా యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా, ఇప్పటి వరకు రైతులు 1.60 లక్షల యూరియా బస్తాలు బుక్ చేసుకున్నారని, 1.40 లక్షల బస్తాలు తీసుకున్నారని వివరించారు. సీఎం కప్ పోటీలలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 4 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు రావడం గర్వకారణమన్నారు. ఇందుకుగాను, అధికారులకు, కోచ్ లకు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అంతకుముందు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన డీసీవో నర్సయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కలెక్టర్, అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


