రండి.. జట్టు కడదాం
● ఖానా‘పురం’లో మారుతున్న సమీకరణలు
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చి ఐదు రోజులైనా ఖానాపూర్ పీఠంపై సస్పెన్స్ వీడడం లేదు. ఇక్కడి ఓటర్లు ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. బీజేపీ, బీఆర్ఎస్ చెరో నాలుగు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచింది. ఒక ఇండిపెండెంట్ మద్దతు ఇవ్వడంతో బలం నాలుగుకు పెరిగింది. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో పీఠం కాంగ్రెస్కు దక్కకుండా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆకుల శ్రీనివాస్ బీఆర్ఎస్కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. బీజేపీ–బీఆర్ఎస్ కలిసి పీఠం దక్కించుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్కు సూచించారు. పొత్తులో భాగంగా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీజేపీకి ఇచ్చి, వైస్ చైర్మన్, 4 కోఆప్షన్ పదవులు బీఆర్ఎస్ తీసుకొవాలన్నారు. అలా కుదరకుంటే బీఆర్ఎస్ చైర్మన్ తీసుకుని వైస్ చైర్మన్, 4 కోఆప్షన్ పదువులు బీజేపీకి ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్కు చెక్ పెట్టేలా వ్యూహం..
ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చెక్ పెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు జేఏసీ నేతృత్వంలో పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేయాలని బీజేపీ నేత సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే అభిబివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఉపాధి హామీ పథకాన్ని ఖానాపూర్లో తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రవీందర్రెడ్డి, మదిరె శ్రీనివాస్, పుప్పాల ఉపేందర్, బుర్ర రమేశ్, కంతి అంబాద్రి, ఎనుగందుల నారాయణ, రాపెల్లి రాజు, కుడిమెత సీతరాం, తిరుమలేశ్, రతన్, శేఖర్, అజయ్, బుచ్చిమల్లు, ప్రభాకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


