గిరిజన సంస్కృతి గొప్పది | - | Sakshi
Sakshi News home page

గిరిజన సంస్కృతి గొప్పది

Jan 23 2026 12:00 PM | Updated on Jan 23 2026 12:00 PM

గిరిజన సంస్కృతి గొప్పది

గిరిజన సంస్కృతి గొప్పది

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గిరిజన దర్బార్‌కు హాజరు నాగోబాకు పోటెత్తిన భక్తులు భారీగా వచ్చిన గిరిజనులు దర్బార్‌లో సమస్యల ఏకరువు అటవీశాఖ పైనే ఫిర్యాదులు

ఆదిలాబాద్‌టౌన్‌/ఇంద్రవెల్లి: గిరిజనుల సంస్కృతి గొప్పదని, గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతరలో భాగంగా గురువారం గిరిజన దర్బార్‌ నిర్వహించగా మంత్రి హాజరయ్యారు. నాగోబా ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గిరిజన దర్బార్‌లో ప్రసంగించారు. గత ప్రభుత్వం నాగోబా ఆలయాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ జాతరల అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించి శాశ్వత నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు. నాగోబా ఆలయాభివృద్ధికి రూ.22 కోట్లు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అటవీ పరిధిలోని గిరిజను సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. చట్టాలను గౌరవించాలని, అటవీశాఖ అధికారులు చిన్నపాటి పొరపాటు చేసినా వారి ఉద్యోగాలకు ముప్పు వస్తుందని తెలిపారు. ఏడుగురు నాగోబా ఆలయ పూజారులకు ధూపదీప నైవేద్యం కింద వేతనాలు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు అందజేశారు. కలెక్టర్‌ రాజర్షిషా, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు ఎస్పీలు కాజల్‌సింగ్‌, మౌనిక, అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఆయా శాఖల అధికారులు, గిరిజ న సంఘాల నాయకులు, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్‌ మెస్రం ఆనంద్‌రావు, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, కేస్లాపూర్‌ సర్పంచ్‌ మెస్రం తుకారాం, మెస్రం వంశ పెద్దలు మెస్రం కోసేరావు, హన్మంత్‌రావు, దాదారావు, మెస్రం వంశ ఉద్యోగులు మెస్రం శేఖర్‌బాబు, మెస్రం దేవ్‌రావు, మనోహర్‌, సోనేరావు తదితరులు పాల్గొన్నారు.

దర్బార్‌లో వినతుల వెల్లువ

గిరిజన దర్బార్‌లో తొమ్మిది తెగల గిరిజనులు ఆయా సమస్యలపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్‌ రాజర్షిషాకు వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా అటవీశాఖ అధికారులపైనే ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రోడ్ల నిర్మాణాలకు అనుమతులి వ్వడం లేదని తెలిపారు. పాదయాత్రగా వచ్చిన గిరి జనులు దర్బార్‌ ఎదుట నిరసన తెలుపగా ఖానా పూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వారిని సముదాయించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోడం గణేశ్‌తో పాటు పలు ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే అంశంపై సుప్రీం కోర్టుకు నిరాధారమైన అఫిడవిట్‌ అందించారని ఆరోపించారు. గిరి జన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సభ్యసాచి ఘోష్‌ను ఆ ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని, జిల్లా కేంద్రంలో ఉంటున్నవారికి సర్వే నంబర్‌ 72లో ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నాగోబా జాతరకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఎటుచూసినా జాతర ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గిరిజన దర్బార్‌ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గుస్సాడీ నృత్యాలు, చిన్నారుల ఆటాపాటలు అలరించాయి. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులు కొమ్ము నృత్యం చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వైద్యశిబిరం ఏర్పాటు చేసి అవసరమైనవారికి చికిత్స, మందులు అందించారు.

డిప్యూటీ సీఎం వస్తారని..

గిరిజన దర్బార్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని ప్రచారం జరిగింది. బుధవారం రాత్రి కేస్లాపూర్‌కు చేరుకున్న ఉపముఖ్యమంత్రి నాగోబాను దర్శించుకున్నారు. గురువారం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దర్బార్‌కు హాజరవుతారని అందరూ భావించినా ఆయన ఆసిఫాబాద్‌ పర్యటనకు వెళ్లిపోయారు. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌, వివేక్‌ వెంకటస్వామి కూడా వస్తారని అనుకున్నా ఒక్క అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాత్రమే హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement