సర్కారు భూములు స్వాహా..!
న్యూస్రీల్
పట్టణాలు, పల్లెలు.. అంతటా కబ్జాలే లావోణి పట్టాలతో ఆక్రమణలు పల్లె భూములపై పెద్దల కన్ను క్రీడా ప్రాంగణాలనూ వదలని వైనం
ముధోల్ సీఐగా రవీందర్
ముధోల్ : ముధోల్ సీఐగా బి.రవీందర్ బాధ్యతలు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేసిన మల్లేశ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ నుంచి రవీందర్ ముధోల్కు బదిలీపై వచ్చారు. నూతన సీఐకి పోలీసులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మల్
తప్పులు లేని ఓటర్ జాబితా సిద్ధం చేయాలి
నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డుల్లో రూపొందించిన ముసాయిదా జాబితాలో తప్పులను సవరించి తప్పులు లేని తుది జాబితా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని గదులను పరిశీలించారు. ఓటరు ముసాయిదా జాబితాలో ప్రజల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 10వ తేదీలోగా తుది జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ ఉన్నారు.
నిర్మల్: జిల్లాలో సర్కారు భూములు మాయమవుతున్నాయి. ఎకరాలకొద్దీ ఉన్న భూములన్నీ బడాబాబుల కబ్జాల్లోకి వెళ్లిపోతున్నాయి. పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ అసైన్డ్, లావోణి, ప్రభుత్వ భూములను దొడ్డిదారిన చెరబడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, పేదలకు ఇళ్లస్థలాల కోసం కేటాయిద్దామంటే ఎక్కడా ఎకరా స్థలం దొరకడం లేదు. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే ప్రభుత్వ భూములు ఎకరాల కొద్దీ కబ్జారాయుళ్ల చేతుల్లోకి వెళ్లడం గమనార్హం. రాజకీయ అండదండలతో సర్కారు భూముల స్వాహాకార్యాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు.
ఏది చేద్దామన్నా.. భూమిలేదు..
జిల్లా ఏర్పడి పదేళ్లు కావస్తోంది. ఇప్పటికీ జిల్లాలో ఒక్క స్టేడియం కూడా లేదు. అందుకు స్థలం కూడా అందుబాటులో లేదు. పోనీ.. చిన్నగా ఇండోర్ స్టేడియం కట్టాలన్నా.. ప్రభుత్వ భూమి దొరకడం లేదు. సరైన స్థలం లేక.. మెడికల్, నర్సింగ్ కాలేజీలను గుట్టలపై కడుతున్నారంటే నిర్మల్లో దుస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కోర్టు సముదాయం కోసం జిల్లాకేంద్రానికి దూరంగా సారంగపూర్ మండలంలో భూమిపూజ చేశారు. ఎందుకంటే.. జిల్లాకేంద్రంలో ఎక్కడా కోర్టు భవనానికి సరిపడా స్థలం దొరకలేదు. ప్రస్తుత కలెక్టరేట్ కూడా స్థానికం సరిపడా భూమి లేకనే ఊరికి దూరంగా పోయిందన్న వాదన ఉంది.
సర్కారు భూమి ఏమైంది...!?
ప్రతీ జిల్లాలో సర్కారుకు ఎకరాల కొద్ది భూములు ఉన్నాయి. నిర్మల్లో మాత్రం కేవలం తహసీల్ ఆఫీస్లోని రికార్డుల్లో మాత్రమే ఆ భూములున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి సదరు సర్వే నంబర్లను పరిశీలిస్తే.. ఎవరో ఒకరు కబ్జాలో ఉండటం విస్తుగొల్పుతోంది. జిల్లాకేంద్రంలో పెద్ద సర్వే నంబర్గా చెప్పే 1309 మొత్తం కబ్జా చేశారు. అసైన్డ్, లావోణి, శిఖం, వక్ఫ్, ఇనామ్, దేవాదాయ.. ఇలా ఏ భూమి సర్వేనంబర్ చెప్పినా.. ఎవరో ఒకరు కబ్జా చేయడమో.. తనవాళ్ల పేరిట పట్టా చేయించుకోవడమో కనిపిస్తోంది.
పల్లెభూములనూ వదలడం లేదు..
నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాలు, మండలకేంద్రాల్లో అంటే భూములకు డిమాండ్ ఉందని కబ్జాలు చేశారనుకుందాం. కానీ.. జిల్లాలో పల్లెల భూములనూ కబ్జారాయుళ్లు వదలడం లేదు. గ్రామాల్లోని లావోణి, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ గజం జాగా లేకుండా చేస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇప్పటికే చెరువులు, కుంటల భూములను మాయం చేశారు. ఇప్పుడు లావోణి, ప్రభుత్వ భూములను పట్టాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈవారంలోనే సారంగపూర్ మండలం నుంచి రెండు గ్రామాలు, నిర్మల్రూరల్, లక్ష్మణచాంద, సోన్ మండలాల్లో ఒక్కో గ్రామం నుంచి కలెక్టర్, మండలాల అధికారులకు భూఆక్రమణలపై ఫిర్యాదులు చేశారు.
ఫిర్యాదులను పరిశీలిస్తాం..
ప్రభుత్వానికి సంబంధించిన భూములను కబ్జా చేస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. సంబంధిత మండల అధికారుల ద్వారా వి వరాలు తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటాం.
– కిశోర్కుమార్, అడిషనల్ కలెక్టర్
ఊరి భూమి కోసం..
సారంగపూర్ తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తున్న వీరంతా మండలంలోని తాండ్ర(జి) గ్రామస్తులు. ఎందుకిలా.. ఊరుఊరంతా వచ్చారు..! ఏం ఫిర్యాదు చేస్తున్నారు..!? అంటే.. గ్రామంలో క్రీడాప్రాంగణానికి కేటాయించిన ప్రభుత్వ భూమి(లావోణి)ని ఓ వ్యక్తి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఊరి అవసరాల కోసం ఉన్న ఆ కాస్త భూమిని కూడా కబ్జా చేస్తే ఎలా అంటూ తాండ్ర(జి) గ్రామస్తులంతా మండలాఫీసుకు వచ్చారు. తమ గ్రామ భూములను కాపాడాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు.
సర్కారు భూములు స్వాహా..!


