
ప్రజల్లో నమ్మకం పెంచాలి
నిర్మల్టౌన్: పోలీస్ లక్ష్యం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదని, ప్రజల్లో నమ్మకం కలిగించడం, వారిని రక్షించడం, గౌరవించబడం అని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారుల, సిబ్బందితో సోమవారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ సూచనలు తెలియజేశారు. ఆధునిక పోలీసింగ్ విజయవంతం కావడానికి ప్రజలతో భాగ్యస్వామ్యం కీలకమని సూచించారు. అందరితో మరింత సమన్వయం కలిగి ఉండాలని తెలిపారు. పేదలు, బలహీనవర్గాల వారు తమ సమస్యలతో సహాయం కోసం వస్తారని, వారి బాధలను సహనంతో విని న్యాయంగా పరిష్కరించే బాధ్యత పోలీసులదే అని తెలిపారు.
ప్రతిష్ట దెబ్బతీయొద్దు..
అవినీతికి పాల్పడడం వలన పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతింటుందని, ప్రజలు విశ్వాసం కోల్పోతారని ఎస్పీ తెలిపారు. అవినీతికి పాల్పడేవారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయతీ, పారదర్శకత, వృత్తిపరమైన విలువలు పాటించాలని స్పష్టం చేశారు. మీరు నమోదు చేసే ప్రతీ ఎఫ్ఐఆర్, స్పందించే అత్యవసర కాల్, దర్యాప్తు చేసే ప్రతీ కేసు, ఇవన్నీ ప్రజల్లో నిబద్ధత పెంచుతాయని తెలిపారు. కాన్ఫరెన్స్లో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్కుమార్, రాజేశ్మీనా, అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.