
వీడ్కోలిక..
ఆనందోత్సాహాల మధ్య భైంసాలో గణేశ్ నిమజ్జనం ఆకట్టుకున్న యువకులు, మహిళల నృత్యాలు శోభాయాత్ర ప్రారంభించిన కలెక్టర్ అభిలాష అభినవ్ బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ జానకీ షర్మిల
వినాయకా..
భైంసా/భైంసారూరల్: తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజలు చేసిన భైంసావాసులు గురువారం నిమజ్జనానికి తరలించారు. ఉదయం 11 గంటలకు గణేశ్నగర్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, ౖభైంసా ఏఎస్పీ అవినాశ్కుమార్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు తూము దత్తు ఉత్సవ కమిటీ అధ్యక్షులు పెండెపు కాశీనాథ్, కార్యదర్శి తాలోడ్ శ్రీనివాస్ పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. ప్రత్యేక సౌండ్ సిస్టంతో గణేశ్ మండళ్ల సభ్యులు నృత్యం చేస్తూ వినాయకులను సాగనంపారు. ఎప్పటిలాగే హతిగణేశ్ మండలి సభ్యులు మరాఠీ భజనలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర మార్గంలో ఇళ్ల వద్దకు వచ్చిన వినాయకులకు మహిళలు కొబ్బరికాయలు కొట్టి, హారతులిచ్చారు. ఒక్కొక్కటిగా తరలిన గణనాథులను మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో భారీ క్రేన్ ఏర్పాటు చేసి భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేశారు.
ఆకట్టుకున్న మహిళల నృత్యాలు..
పట్టణంలోని భారత్ జిన్నింగ్ ఫ్యాక్టరీ, వినాయక్నగర్, సాయికాటన్, సంజయ్గాంధీ మార్కెట్, పురాణబజార్, మార్వాడిగల్లి ఏపీనగర్ ప్రాంతాల్లో మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో మహిళలు వేసిన కోలాటం ఆకట్టుకుంది. విద్యార్థులు, మహిళలు వేసిన కోలాటం చూసేందుకు చుట్టుపక్కల జనం భారీగా తరలివచ్చారు.
పంజేషావద్ద బందోబస్తు
పంజేషా చౌక్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ అవినాశ్కుమార్ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 600 మంది కానిస్టేబుళ్లు బందోబస్తును పర్యవేక్షించారు. పట్టణంలోని కూడళ్లు, ప్రధాన మార్గాల్లో 120 ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 30 రూట్టాప్లతో బందోబస్తును పర్యవేక్షించారు. హైదరాబాద్లోని కంట్రోల్రూంతో అనుసంధానించి ఎప్పటికప్పుడు శోభాయాత్ర దృశ్యాలను తిలకించారు.
భక్తులకు సేవలు అందించి...
గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఉత్సవ సమితి, హిందూవాహిని, ఐక్యత సేవా సమితి, కిసాన్సేవా సమితి, తూము ముత్తన్న సేవా సమితితో పాటు పలువురు సేవలు అందించారు. పుష్పక్ సేవా సమితి ఆధ్వర్యంలో పులిహోర, ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో అల్పహారం పంపిణీ చేశారు. మున్నూరుకాపు సంఘం భట్టిగల్లీ, కోర్భాగల్లీ, కిసాన్గల్లీ, వీరశైవలింగాయత్, ఓంకార్యూత్, సాయిబాల్ గణేశ్ మండలీ, నేతాజీ గనేశ్మండలీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

వీడ్కోలిక..

వీడ్కోలిక..

వీడ్కోలిక..

వీడ్కోలిక..