
‘మావో’ళ్లు ఎట్లున్నరో..!
● ఉద్యమంలో ఉమ్మడి జిల్లా వాసులు ● దశాబ్దాలుగా అడవుల కే పరిమితం ● వైభవం నుంచి ఉనికి కోల్పోతున్న దశకు చేరిన పార్టీ ● ‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో సర్వత్రా చర్చ ● నేతల కుటుంబాల్లో ఆందోళన
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా ఒకప్పుడు వామపక్షవాద ఉద్యమానికి బలమైన కేంద్రంగా ఉండేది. ప్రతీ గ్రామం నక్సలైట్లకు ఆశ్రయంగా మారిన రోజులు గతంలో ఉండేవి. అయితే, ఇప్పుడు ఈ జిల్లా మావోయి స్టు ప్రభావ రహిత ప్రాంతంగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి మావోయిస్టు పా ర్టీని అంతం చేసేందుకు ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ పరిస్థితిలో ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు ఇంకా సిద్ధాంతానికి కట్టుబడి పోరు బాట లోనే కొనసాగుతున్నారు. వారి ఆచూకీపై కు టుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉనికి కోల్పోతున్న ఉద్యమం!
ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలపాటు మావోయిస్టు ఉద్యమం బలంగా సాగింది. ప్రస్తుతం దాని ఉనికి దాదాపు క్షీణించింది. వందలాదిమంది కార్యకర్తలు ఎన్కౌంటర్లలో మరణించారు. కొందరు లొంగిపోయారు. పార్టీ కేంద్ర కమిటీ స భ్యుడు కటకం సుదర్శన్ (ఆనంద్, 69) 2024 జూన్లో మరణించారు. సీనియర్ నాయకులు ఒగ్గు సత్వాజీ, కాసర్ల రవి (అశోక్), కంతి లింగ వ్వ, గడ్డం మధూకర్, సుమన్, రవిబాబు లాంటి వారిని పార్టీ కోల్పోయింది. మూల దేవేందర్రెడ్డి అరెస్టయ్యారు. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్క మరణించారు.
మావోయిస్టు రహిత జిల్లాగా..
కేంద్ర హోంశాఖ ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల జా బితా నుంచి తొలగించింది. ప్రస్తుతం తెలంగా ణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రమే ఈ జాబితాలో కొనసాగుతోంది. గతంలో నిర్మల్ నుంచి బెజ్జూరు వరకు, బొగ్గు గనులు, అడవులు, గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలా పాలు సాగేవి. పీపుల్స్వార్ గ్రూప్ ద్వారా సింగరేణిలో సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య) బ లంగా పనిచేసిన రోజుల్లో ఎన్కౌంటర్లు తరచూ జరిగేవి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సానుభూతిపరుల బలంతో ఉద్యమం విస్తరించింది. కొత్త నియామకాలతో విద్యావంతులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, గత రెండు దశాబ్దాల్లో పరిస్థితులు మారాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ ఉనికి దాదాపు క్షీణించింది. ఇప్పుడు అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు మినహా ఎలాంటి కార్యకలాపాలు కనిపించడం లేదు.
కుటుంబాల్లో ఆందోళన
దండకారణ్యం, అబూజ్మడ్ వంటి ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో, ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన నాయకుల ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి బలమైన ఉద్యమం ఇప్పుడు దాదాపు అంతరించిన స్థితిలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణ, ఆపరేషన్ కగార్ వంటి చర్యలతో మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, జిల్లాలో గతంలో ఉన్న సానుభూతి, కార్యకలాపాలు గణనీయంగా తగ్గడం, భవిష్యత్తులో ఈ ఉద్యమం పూర్తిగా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికీ కీలక స్థానాల్లో కొందరు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఇప్పటికీ ఉద్యమ బాట వీడలేదు. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇర్రి మోహన్ రెడ్డి: సెంట్రల్ బ్యూరో, కేంద్ర సాంకేతిక కమిటీ సభ్యుడు.
బండి ప్రకాశ్: సింగరేణి కోల్బెల్ట్ కమిటీ సెక్రటరీ, ఇటీవల కేంద్ర కమిటీలో చేరారు.
మైలారపు అడెల్లు: స్టేట్ కమిటీ సభ్యుడు, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల కమిటీ ఇన్చార్జి.
సలాకుల సరోజ: సీనియర్ నాయకురా లు, పార్టీ ప్రింటింగ్ప్రెస్ బాధ్యురాలు.
జాడి వెంకటి, పుష్పలత: సీనియర్ నాయకులు, దండకారణ్యంలో ఉన్నారు.
చౌదరి అంకుబాయి, లచ్చన్న, తూము శ్రీనివాస్: సీనియర్ కేడర్గా కొనసాగుతున్నారు.

‘మావో’ళ్లు ఎట్లున్నరో..!