ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరికొందరిని ఆస్పత్రికి తరలించగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
హమీర్పూర్ జిల్లాలో బేత్వా నది వద్ద శుక్రవారం తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెన కింద నిద్రిస్తున్న కార్మికుల మీద అవి పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడినవాళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
At least 6 people were killed after an under construction bridge collapsed in Hamirpur district of Uttar Pradesh. pic.twitter.com/2UfarN3Nm9
— Piyush Rai (@PiyushRaiUP65) May 29, 2026
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జిని నాసికరంగా నిర్మించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా ఆంధీ తుపాను హెచ్చరిక ఉన్నప్పటికీ కార్మికుల భద్రత విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహిరించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. తీవ్ర ఆరోఫణల నేపథ్యంలో విస్తృతస్థాయి దర్యాప్తునకు ఆయన జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలె బిహార్లోనూ ఈ తరహా ప్రమాదం ఒకటి జరిగింది.


