‘నిర్లక్ష్యం చేస్తే సెకండ్‌ వేవ్ నుంచి ఎవరూ కాపాడలేరు’ | Vaccines Should Give Protection From COVID-19 For 8-10 Months | Sakshi
Sakshi News home page

‘నిర్లక్ష్యం చేస్తే సెకండ్‌ వేవ్ నుంచి ఎవరూ కాపాడలేరు’

Mar 22 2021 4:39 AM | Updated on Mar 22 2021 10:08 AM

Vaccines Should Give Protection From COVID-19 For 8-10 Months - Sakshi

జమ్మూ మార్కెట్‌లో మాస్క్‌లు ధరించని జనం

మొత్తం 3,09,087 యాక్టివ్‌ కేసులు న్నాయి. కేసులు ఈ స్థాయిలో పెరిగిపోవడానికి గల కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. గత 11 రోజులుగా భారీగా కేసులు పెరుగుతున్నాయి.  గత 24 గంటల్లో 43,846 కేసులు నమోదైనట్టుగా ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 15 లక్షల 99 వేల 130కి చేరుకుంది. యాక్టివ్‌ కేసుల శాతం 2.66కి పెరిగింది. మొత్తం 3,09,087 యాక్టివ్‌ కేసులు న్నాయి. కేసులు ఈ స్థాయిలో పెరిగిపోవడానికి గల కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

కోవిడ్‌–19 నిబంధనలు ప్రజలు సరిగా పాటించకపోతే దేశాన్ని సెకండ్‌ వేవ్‌ నుంచి ఎవరూ కాపాడలేరని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. వీలైనంత త్వరగా అందరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని హితవు పలికారు. ప్రజలందరూ వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకొస్తే కరోనా భూతాన్ని తరిమి కొట్టవచ్చునని అన్నారు. జన్యు మార్పిడికి లోనైన వివిధ రకాల వైరస్‌లు భారత్‌లోకి రావడం, భారీగా జనాల గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించడం తాజాగా కేసులు పెరిగిపోవడానికి కారణమని ఆయన చెప్పా రు.

‘‘కరోనా నిబంధనల్ని జనాలు గాలికొదిలేశారు. ముప్పు తప్పిందని అందరూ అనుకుంటున్నారు. వ్యాక్సిన్‌ కూడా రావడంతో ధీమా పెరిగిపోయింది. ఎక్కువ మందితో పెళ్లిళ్లు,  వేడుకలు చేస్తున్నారు. ఇలాంటి భారీ కార్యక్రమాలే కరోనా కేసుల్ని పెంచుతున్నాయి’’ అని రణ్‌దీప్‌ అంచనా వేశారు. కరోనా కట్టడికి అతి ముఖ్య సూత్రమైన టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్‌ విధానాన్ని పాటించడంలో ప్రభుత్వాలు  కొద్ది కాలంగా నిర్లక్ష్యం చేస్తున్నాయ న్నారు. వివిధ దేశాల  కొత్త మ్యుటేషన్‌ వైరస్‌లు కూడా కేసుల తీవ్రతకు కారణమని వివరించారు. దీనిని నిలువరించాలంటే కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యమివ్వాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.కె. పాల్‌ చెప్పారు.

అయిదు రాష్ట్రాల నుంచే 83% కేసులు
4 నెలల్లో అత్యధికంగా రోజువారీ కేసులు 43,846 నమోదైతే, అందులో 83% కేసులు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌ నుంచే వచ్చాయి. మహారాష్ట్రలో ఏకంగా 30,535 కేసులు నమోదయ్యాయి. మరో 197 మంది కరోనాతో చనిపోగా మృతుల సంఖ్య 1,,59,755కి చేరుకుంది.

లోక్‌సభ స్పీకర్‌కు కరోనా
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా(58)కు కరోనా పాజిటివ్‌గా తేలింది.  ప్రస్తుతం ఆయన ఎయి మ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. బిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు ఆదివారం తెలిపాయి.

రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో ఆంక్షలు
జైపూర్‌/భోపాల్‌: రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు ప్రకటించాయి. రాజస్తాన్‌ ప్రభుత్వం సోమవారం నుంచి 8 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది.  ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వారు 72 గంటల్లోపు తీసుకున్న కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టును చూపించాలని లేదంటే 15 రోజులపాటు క్వారంటైన్‌లో గడపాలని తెలిపింది.

ఇండోర్‌లో లాక్‌డౌన్‌
మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, జబల్పూర్‌ నగరాల్లో ఆదివారం వీధులు బోసిపోయాయి. ఈ నగరాల్లో ప్రతి శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుంచి భోపాల్, ఇండోర్‌ జిల్లాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement