Chhattisgarh: స్వైన్‌ ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి.. అరోగ్యశాఖ అప్రమత్తం | Two Women Died Due to Swine Flu | Sakshi
Sakshi News home page

Chhattisgarh: స్వైన్‌ ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి.. అరోగ్యశాఖ అప్రమత్తం

Aug 10 2024 9:14 AM | Updated on Aug 10 2024 9:14 AM

Two Women Died Due to Swine Flu

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యింది. వ్యాధి లక్షణాల గురించి అధికారులు మరింత విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అనుమానిత రోగులను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

అనారోగ్యం బారినపడిన కొరియా జిల్లాలోని పండోపరా గ్రామానికి చెందిన 51 ఏళ్ల మహిళ జిల్లా ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్య పరీక్షలు జరపగా, స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో బాధితురాలిని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ బాధితురాలి పరిస్థితి మరింత దిగజారింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. శుక్రవారం బాధితురాలు మృతిచెందింది.

రెండవ కేసు విషయానికొస్తే జంజ్‌గిర్ చంపాలోని లక్షన్‌పూర్ గ్రామంలో నివసిస్తున్న 66 ఏళ్ల మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. స్వైన్‌ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. జూలై 29 నుంచి ఆగస్టు 9 వరకు అపోలో ఆస్పత్రిలో 9 మంది స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరిలో ఐదుగురు బిలాస్‌పూర్ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం ఐదుగురు బాధితులు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఆరోగ్యశాఖ ప్రతిరోజూ సేకరిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement