సాక్షి,చెన్నై: తమిళనాడులో టీవీకేదే విజయమంటూ యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. మెజార్టీ సర్వే సంస్థలకు భిన్నంగా టీవీకే చీఫ్ విజయ్దే ప్రభంజనమన్న ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్.. టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండో స్థానంలో డీఎంకే 92-100 సీట్లు సాధించే అవకాశముందని అభిప్రాయం పడింది. మొత్తానికి టీవీకేకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ ఇన్సైట్ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. మాట్రిజ్ సర్వే.. డీఎంకే: 122-132, అన్నా డీఎంకే: 87-100, టీవీకే 10-12, ఇతరులు 0-6 సీట్లు సీట్లు వస్తాయని పేర్కొంది. డీఎంకే 134-141, అన్నా డీఎంకే 84-90, టీవీకే 4-8 సీట్లు సాధించే అవకాశముందని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. కాగా, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం మిగతా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విభిన్నంగా ఎగ్జిట్పోల్స్ ఫలితాలను ప్రకటించింది. టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశముందని చెప్పింది.
తమిళనాడులో ఈసారి ప్రధాన పోటీ డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ఉన్నప్పటికీ, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభావంపైనే అందరి దృష్టి నెలకొన్న సంగతి తెలిసిందే విజయ్ పార్టీ చీల్చే ఓట్లు అధికార డీఎంకే కూటమిపై ప్రభావం చూపుతాయా లేక అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ను దెబ్బతీస్తాయా అన్నది సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. ఈ ముక్కోణపు సమరంలో కొన్ని నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్న అంచనాల నడుమ, ప్రధాన పార్టీలలో టెన్షన్ పెట్టిస్తోంది. ఇవాళ విడుదలైన పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని అంచనా వేయగా.. యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది.


