పార్టీకి, పదవికి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా
అభిషేక్ లక్ష్యంగా కల్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు
మమత వెంటే ఉంటామన్న శత్రుఘ్న సిన్హా, సౌగతరాయ్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో తలెత్తిన సంక్షోభం గురువారం మరింత ముదిరింది. ఆ పార్టీకి చెందిన మూడో రాజ్యసభ ఎంపీ రాజీనామా చేశారు. ఎంపీ ప్రకాశ్ చిక్ బరాయిక్ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు, మమతా బెనర్జీ వెన్నంటే ఉంటామంటూ సీనియర్ నేతలు బాబుల్ సుప్రియో, శత్రుఘ్న సిన్హా, సౌగతా రాయ్ బహిరంగంగా ప్రకటించారు. పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి.
సీనియర్ నేత, లోక్సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మమత మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. అభిషేక్ను పార్టీ నుంచి తొలగిస్తేనే తాను టీఎంసీలో కొనసాగు తానని స్పష్టం చేశారు. ఇలా ఉండగా, తమ పక్షంలో చేరిన ఎమ్మెల్యే సంఖ్య 64కు చేరుకుందని తిరుగుబాటు టీఎంసీ నేత రితబ్రత బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. కాకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో 20 మందికి పైగా టీఎంసీ లోక్సభ ఎంపీలు వేరుకుంపటి పెట్టుకోవడం తెల్సిందే.
గుడ్ బై చెప్పిన మూడో ఎంపీ
రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ చిక్ బరాయిక్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్ తర్వాత రాజ్యసభ సీటును వదులుకున్న మూడో ఎంపీ ప్రకాశ్. బీజేపీ నేత నిశికాంత్ దుబే నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగాల్ ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నేను టీఎంసీ నుంచి వైదొలిగా. కేంద్రంతో సమన్వయం లేకపోవడంతో వామపక్షం హయాంలో 34 ఏళ్లు, టీఎంసీ హయాంలో 15 ఏళ్లు రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. రాజకీయ విభేదాల వల్ల ప్రజలు బలయ్యారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది’అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం సువేందు మార్గదర్శకత్వంలో ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.
మమత బాటలోనే నడుస్తాం
పార్టీలో సంక్షోభం కొనసాగుతుండగా, కొందరు ఎంపీలు తాము టీఎంసీ అధినేత్రి మమత వెంటే ఉంటామంటూ బహిరంగంగా ప్రకటించారు. తిరుగుబాటు పక్షాన చేరారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం సీనియర్ సినీ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా గళం విప్పారు. కష్టకాలంలో పార్టీ, మమతా బెనర్జీని వదిలి వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. తనకు అలాంటి ఉద్దేశమే లేదన్నారు. కొందరు తమ సొంత కారణాలు, భయాందోళనలతో పార్టీని వీడుతున్నారన్నారు.
ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీకి ఆయన ఎక్స్లో అభినందనలు తెలపడంతో, పార్టీ మారుతారంటూ ఊహాగానాలు వెలు వడ్డాయి. బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన రాజ్యసభ ఎంపీ బాబుల్ సుప్రియో కూడా మమతకు మద్దతు ప్రకటించారు. ‘ఏ వర్గంలోనూ, ఏ పార్టీలోనూ చేరబోను. కష్టకాలంలో పార్టీని వీడటం సరైన చర్య కాదు’అని ఆయన ఎక్స్లో వ్యాఖ్యానించారు. టీఎంసీ లోక్సభ ఎంపీ ప్రతిమా మండల్కూడా తిరుగుబాటువర్గంలో చేరడం లేదని స్పష్టం చేశారు. తిరుగుబాటువర్గంనుంచి తనకు ఆహ్వానం అందినప్పటికీ తిరస్కరించినట్లు మరో సీనియర్ నేత సౌగతా రాయ్ వెల్లడించారు. మమతా బెనర్జీకి తన మద్దతు కొనసాగిస్తానన్నారు.
అభిషేక్ అహంకారి..చంచల స్వభావి
లోక్సభలో టీఎంసీ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీ మాత్రం పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. తన వంటి విధేయులైన సీనియర్లు కావాలో, లేక మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలో తేల్చుకోవాలని మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చారు. అభిషేక్ను ఆయన అహంకారి, చంచల స్వభావి అంటూ తిట్టిపోశారు. టీఎంసీకి సంబంధించిన చట్టపరమైన అంశాలు, కేసుల విషయంలో అభిషేక్ జోక్యం కొనసాగించిన పక్షంలో తాను వాటి నుంచి వైదొలుగుతానంటూ సీనియర్ లాయర్ కూడా అయిన కల్యాణ్ హెచ్చరించారు. అభిషేక్ను పార్టీలో అన్ని రకాల బాధ్యతల నుంచి తప్పిస్తేనే తాను పార్టీలో కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో దర్యాప్తు చేసేందుకు వచ్చిన సీఐడీ అధికారులపై తనకు తెలియకుండా కలకత్తా హైకోర్టులో అభిషేక్ వేరుగా కేసు వేయడం కల్యాణ్కు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని పరిశీలకులు అంటున్నారు. దీంతో, ఇప్పుడు మమతా బెనర్జీ తీవ్ర సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.


