‘కాక్రోచ్‌ జనతా పార్టీ’పై విచారణకు నో! | Supreme Court rejects CBI probe plea against Cockroach Janta Party | Sakshi
Sakshi News home page

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’పై విచారణకు నో!

May 26 2026 1:31 AM | Updated on May 26 2026 1:31 AM

Supreme Court rejects CBI probe plea against Cockroach Janta Party

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో ఇటీవల పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ)’కి సంబంధించిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని మరీ సెంటిమెంట్‌గా తీసుకోవద్దని, ఇందులో అత్యవసరంగా విచారించాల్సినంత తీవ్రత ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. 

సోషల్‌ మీడియాలో ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన సీజేపీ వెనుక ఉన్న వ్యక్తులపై, అలాగే నకిలీ న్యాయవాద డిగ్రీల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయవాది రాజా చౌదరి పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున ఎన్‌.కె.గోస్వామి వాదనలు వినిపించారు. సీజేపీ సోషల్‌ మీడియా ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబారుస్తోందని పేర్కొన్నారు. 

కోర్టులో జరిగే సంభాషణలు, న్యాయమూర్తుల వ్యాఖ్యలను కొందరు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు వ్యాఖ్యలను కత్తిరించి, మీమ్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. తాము వాక్‌ స్వాతం్రత్యానికి, ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకం కాదని, కేవలం కోర్టు వ్యాఖ్యలను స్వార్థానికి వాడుకోవడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ వీఎం పంచోలిల ధర్మాసనం.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మరీ అంత సెంటిమెంట్‌గా తీసుకోవద్దంటూ వ్యాఖ్యానించింది. ఈ అంశంపై వెంటనే విచారించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement