
నలుగురి జాడ గల్లంతు
18 మందిని రక్షించిన తీరగస్తీ బలగాలు
కొచ్చి: సింగపూర్ జెండాతో శ్రీలంక నుంచి ముంబైకి బయల్దేరిన విదేశీ కంటైనర్ సరకు రవాణా నౌక కేరళ సమీప సముద్రజలాల్లో అగ్నిప్రమాదానికి గురైంది. 22 మంది సిబ్బంది ఉన్న ఈ నౌక నుంచి 18 మందిని భారత తీర గస్తీ బలగాలు కాపాడాయి. 270 మీటర్ల పొడవైన ఎంవీ వాన్ హాయ్503 పేరు గల ఈ నౌకలో నలుగురి జాడ గల్లంతయింది. కేరళలోని కన్నూర్ జిల్లాలోని అఝిక్కల్ పట్టణ తీరం నుంచి 44 నాటికల్ మైళ్ల దూరంలో సోమవారం ఉదయం 9.20 గంటలకు ఈ దుర్ఘటన సంభవించింది.
విషయం తెల్సిన వెంటనే భారత గస్తీ బలగాలు రంగంలోకి దిగి 18 మంది సిబ్బందిని కాపాడాయి. నౌకలో ఎనిమిది మంది చైనా, ఆరుగు తైవాన్, ఐదుగురు మయన్మార్, ముగ్గురు ఇండోనేసియాకు చెందిన సిబ్బంది ఉండగా వారిలో 18 మందిని రక్షించగాలిగారు. వీరిని ఐఎన్ఎస్ సూరత్ నౌకలో మంగళూరు పోర్ట్కు తీసుకొచ్చారు. షెడ్యూల్ ప్రకారం నౌక జూన్10వ తేదీకల్లా ముంబైలోని నవాషేవా ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ప్రమాదానికి గురైంది. గత 30 రోజుల్లో కేరళ సమీపంలో సరకు రవాణానౌక ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. మే 24న లైబీరియా జెండాతో వెళ్తున్న కార్గో నౌక తీరానికి 14.6 మైళ్లదూరంలో మునిగిపోయింది.