ఢిల్లీ: ఢిల్లీలో వాడీవేడిగా కర్ణాటక రాజకీయాలు సాగుతున్నాయి. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి.. రాష్ట్ర నాయకత్వంలో మార్పు రాబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ఇందిరాభవన్లో హైకమాండ్తో సిద్ధూ, డీకే సమావేశమయ్యారు. సమావేశంపై మాట్లాడేందుకు సిద్దూ, డీకే నిరాకరించారు. సమావేశానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు.
మే 20తో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తి కానుంది. పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎం శివకుమార్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, సిద్ధరామయ్యను మారిస్తే ఓబీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో అధిష్టానం ఉంది.
సిద్ధరామయ్యకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మూడేళ్లలో తన ప్రభుత్వ పనితీరు, ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు తదితరు అంశాలను సిద్దరామయ్య ప్రస్తావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మార్పు ఉంటుందా? ఎన్నికల వరకు సిద్ధ రామయ్యనే కొనసాగిస్తారా? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, గత డిసెంబరు నుంచి సీఎం కుర్చీ కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇరువురూ ఢిల్లీకి వెళ్లి మంతనాలు సాగించారు.


