ఒక గృహిణి తలచుకుంటే ఆకాశమే హద్దుగా ఎదగగలదని నిరూపించిన లలితా పాటిల్ స్ఫూర్తి దాయక కథ ఇది. కేవలం రూ. 2,000 పెట్టుబడితో ప్రారంభించి, ఏడాదికి ఒక కోటి టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగారు థానేకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త లలితా పాటిల్. పదండి ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని థానేకు చెందిన లలితా పాటిల్కు 20 ఏళ్లకే వివాహమైంది. వేణ్ణీల్లకు చన్నీళ్లు తోడు అన్నట్టు భర్తకు ఆసరాగా ఉండేందుకు, ఆర్థిక స్వతంత్రత కోసంట్యూషన్లు చెప్పడం, మందులు అమ్మడం లాంటి పనులు చేసింది. అయినా ఆశించిన ఫలితం రాలేదు. లలిత భర్త గ్యాస్ ఏజెన్సీ నడిపేవారు, కానీ ప్రభుత్వ పైప్లైన్ పథకం వల్ల ఆ వ్యాపారం దెబ్బతిని ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఫిజిక్స్లో పట్టభద్రురాలైన లలిత, తాను ఎప్పుడూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావించేవారు. ఈ నేపథ్యంలోనే సమయం చూసి ఆమె పెద్ద సాహసం చేశారు.
ఇదీ చదవండి: భార్య ఎఫైర్లు, ప్రైవేట్ వీడియోలు : టెకీ ఆత్మహత్యకేసులో కీలక పరిణామం
టిఫిన్ సర్వీస్ ప్రస్థానం
ఆ క్లిష్ట పరిస్థితుల్లో లలిత 2016లో కేవలం రూ. 2,000లతో టిఫిన్ బాక్సులు కొని, మరో రూ. 500లతో పాంప్లెట్లు ముద్రించి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. తన సంస్థకు 'ఘరాచి ఆఠవణ్' (Gharachi Athavan) అంటే 'ఇంటి జ్ఞాపకం' అని పేరు పెట్టారు. థానేలోని ఉద్యోగులు, విద్యార్థులనుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ఇక్కడితో ఆమె పయనం ఆగిపోలేదు.

టర్నింగ్ పాయింట్
ఒక ఏడాది తర్వాత, తనను కేవలం గృహిణిగా కాకుండా ఒక బిజినెస్ ఉమెన్గా నిరూపించుకోవాలని ఆమె తపించారు. కానీ పెట్టుబడికి డబ్బు లేదు. 2019లో బ్రిటానియా ఇండస్ట్రీస్ నిర్వహించిన స్టార్టప్ పోటీ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ పోటీలో విజేతగా నిలిచి రూ. 10 లక్షల ప్రైజ్ మనీని (పన్నుల తర్వాత రూ. 7 లక్షలు) అందుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు.
చిన్న టిఫిన్ సెంటర్ నుంచి రెస్టారెంట్ దాకా
2019, జూలైలో థానేలోని కోప్రి ప్రాంతంలో ఆమె సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించారు. ఇంటి రుచులతో కూడిన భోజనం, కేటరింగ్ మరియు టిఫిన్ సర్వీసులతో ఆమె వ్యాపారం శరవేగంగా విస్తరించింది. ఆమె విజయప్రస్థానాన్ని చూసి, భర్త కూడా తన పాత ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలో తోడుగా చేరారు. మరో 10 మంది ఉపాధి కల్పించారు. ఫలితంగా ఆమె ఆదాయం నెలకు రూ. 6-7 లక్షలు సంపాదిస్తున్నారు. వార్షిక ఆదాయం రూ. 1 కోటికి చేరుకుంది.
"ఇంటి నుండి పనిచేసే మహిళను ఎప్పుడూ గృహిణిగానే చూస్తారు. ఆమె ఇంటి గడప దాటి బయటకు అడుగుపెట్టి, సమాజం 'ముఖ్యమైనది'గా భావించే ఏదైనా సాధించినప్పుడే ఆమె కష్టానికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి" -లలితా పాటిల్


