చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత.. ఎం.కే స్టాలిన్ను రజనీకాంత్ ఆయన నివాసంలో ఇవాళ(బుధవారం) కలిశారు. మర్యాద పూర్వకంగానే రజనీకాంత్.. స్టాలిన్తో భేటీ అయ్యారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్.. స్టాలిన్ కలిసి కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నటుడు విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకోగా, డీఎంకే 59 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.
స్టాలిన్ తన కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. డీఎంకే, మిత్రపక్షాలు రెండో అతిపెద్ద కూటమిగా నిలిచినందున.. కొత్త అసెంబ్లీలో అవి ప్రతిపక్ష స్థానంలో కూర్చోనున్నాయి. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
గతంలో రజనీకాంత్.. డీఎంకేకు అందించిన మద్దతు దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 1995లో రాజకీయాల్లోకి వస్తారని భావించిన సమయంలో ఆయన డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 1998 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీకి అండగా నిలిచారు. ఆ తర్వాత 2017లో రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించినప్పటికీ, 2021లో అనారోగ్య కారణాలతో రజనీకాంత్ వెనక్కి తగ్గారు. విజయ్ విజయం తర్వాత.. ఆయనకు అభినందనలు తెలుపుతూ రజనీకాంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
కాగా, విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఆయన పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఉప ఎన్నికలు జరగవచ్చు. మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకు ఇంకా 10 స్థానాల మద్దతు అవసరం.


